Bellamkonda Sai Srinivas | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్లో అరుదైన డిజిటల్ మైలురాయిని అందుకున్నారు. పలువురు స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని ఘనతను ఆయన సొంతం చేసుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన 2017 యాక్షన్ ఎంటర్టైనర్ ‘జయ జానకి నాయక’ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్లో ఏకంగా 1 బిలియన్ (100 కోట్ల) వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ‘ఖుంఖార్’ పేరుతో ప్రముఖ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఈ చిత్రం సంవత్సరాలు గడిచినా ప్రేక్షకాదరణను ఏమాత్రం కోల్పోలేదు. నెమ్మదిగా వ్యూస్ పెంచుకుంటూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల వ్యూస్ మార్క్ను దాటడం విశేషం. దీంతో భారతీయ సినీ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.
ఈ రికార్డుతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యూట్యూబ్లో ఒక ఫుల్ లెంగ్త్ డబ్బింగ్ సినిమాకు 1 బిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు హీరోగా ఆయన నిలిచారు. టాలీవుడ్కు చెందిన అనేక బ్లాక్బస్టర్ చిత్రాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్లో విడుదలైనప్పటికీ, ఒక్క సినిమాతో ఈ స్థాయి వ్యూస్ను అందుకోవడం ప్రత్యేకమైన విజయంగా చెప్పవచ్చు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో డీసెంట్ హిట్గా నిలిచిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్ఫామ్లలో మాత్రం అసాధారణ ఆదరణను దక్కించుకుంది.
ఇటీవల ఈ సినిమాలోని ఓ ఎమోషనల్ డైలాగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో విపరీతంగా వైరల్ కావడంతో సినిమా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ‘ఖుంఖార్’కు మరింత మంది ప్రేక్షకులు చేరువయ్యారు. యూట్యూబ్లో విడుదలై దాదాపు ఏడేళ్లు గడిచినా ఈ చిత్రానికి ఇప్పటికీ లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం విశేషం. ముఖ్యంగా ఉత్తర భారత ప్రేక్షకుల్లో ఈ యాక్షన్ డ్రామాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ మరోసారి స్పష్టమైంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయంతో సరిపెట్టుకున్న ‘జయ జానకి నాయక’ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది.