Venu Thottempudi | టాలీవుడ్ నటుడు తొట్టెంపుడి వేణు చిక్కుల్లోపడ్డాయి. ఆయనపై పోలీసు కేసు నమోదైంది. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులతో పాటు ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతకు చెందిన సంస్థ ఎండీపై సైతం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఉత్తరాఖండ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ప్రాజెక్టును టీహెచ్డీసీ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ని దక్కించుకుంది. ఈ ప్రాజెక్టును బంజారాహిల్స్లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్స్ట్రక్షన్స్ అనే రెండు సంస్థలకు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే, రెండు గ్రూపుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొన్నది. దాంతో రిత్విక్ ప్రాజెక్ట్స్తో చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగా మోసం చేసి ప్రాజెక్టులో వచ్చిన డబ్బంతా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ రవికృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రొగ్రెసివ్ కంపెనీలో ఉన్న డైరెక్టర్లతో పాటు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.