ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య శనివారం కన్నుమూశారు. సినీరంగంలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య యూసుఫ్ గూడలోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున కన్నుమూసాడు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే బాలయ్య పుట్టినరోజు కూడా ఇదేరోజు కావడం. 1958లో వచ్చిన ‘ఎత్తుకు పై ఎత్తు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన బాలయ్య ఇప్పటివరకు దాదాపు 300 సినిమాల్లో నటించాడు.
బాలయ్య నటుడిగానే కాకుండా నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేసి సినీరంగంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈయన కథా రచయితగా ‘ఊరికిచ్చిన మాట’ సినిమా కు నంది అవార్డును అందుకున్నాడు. 1971లో అమృత అనే బ్యానర్ను స్థాపించి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పటివరకు ఈయన తన బ్యానర్లో 10 సినిమాలను నిర్మించాడు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నాడు. క్రిష్ణంరాజు హీరోగా నటించిన ‘నిజం చెబితే నేరమా?’ సినిమాతో ఈయన దర్శకుడిగా మెగా ఫోన్ పట్టాడు. ‘పసుపు తాడు’, ‘పోలీస్ అల్లుడు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. ‘మన్మధుడు’ సినిమాలో నాగార్జునకు తాతగారిలా, మల్లీశ్వరీలో కత్రినాకైఫ్కు తాతగా, మిత్రుడు సినిమాలో బాలకృష్ణ తాతగా మనకు ఎక్కువగా గుర్తుండిపోయారు. చివరగా ఈయన వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘రామాచారి’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు.