‘ఏపీలో సినీ వర్గాల గోడును వినిపించుకునే నాథుడు కరువయ్యాడు. టికెట్ల రేట్ల సమస్యలపై సినీ పరిశ్రమ మొత్తం కలిసికట్టుగా చర్చలు జరపాలి. ఆ ప్రతిపాదనను ప్రభుత్వానికి విన్నవించాలి. ఇండస్ట్రీ మొత్తం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటా’ అని అన్నారు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకుడు.
బుధవారం హైదరాబాద్లో జరిగిన విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘పాన్ వరల్డ్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరించింది. ప్రస్తుతం సినిమా నిత్యావసర వస్తువుగా మారింది. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనే తపన దర్శకనిర్మాతలకు ఉండాలి. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం సినీ పరిశ్రమకు కావాలి’ అని తెలిపారు. ‘సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చిన చిత్రమిది. కథ, తన పాత్ర గురించి ఒక్క ప్రశ్న కూడా బాలకృష్ణ నన్ను అడగలేదు. నన్ను నమ్మి సినిమా చేశారు. అందరి హీరోల అభిమానులను ఈ సినిమా సంతృప్తిపరుస్తుంది అని బోయపాటి శ్రీను చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అయ్యప్ప పి శర్మ తదితరులు పాల్గొన్నారు.