Baahubali the eternal war | ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిత్రం బాహుబలి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎస్.ఎస్. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే కాదు, గ్లోబల్ ఫిల్మ్ వరల్డ్లో కూడా సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఆ ప్రభంజనం మరోసారి రిపీట్ కానుందన్నట్లుగా… బాహుబలి విశ్వాన్ని కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీ ప్రయత్నం మొదలైంది. ఈసారి బాహుబలి కథను యానిమేషన్ రూపంలో, హాలీవుడ్ స్థాయి విజువల్స్తో రూపొందిస్తున్నారు.
‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ పేరుతో ప్రకటించిన ఈ చిత్రం, లైవ్ యాక్షన్ వెర్షన్కు పూర్తి భిన్నంగా, కొత్త యూనివర్స్ అనుభూతిని ఇవ్వబోతోందని టీమ్ తెలిపింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ను రాజమౌళి కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో యానిమేషన్ కంటెంట్ తయారీలో నిష్ణాతుడు అయిన దర్శకుడు ఇషాన్ శుక్లా తెరకెక్కిస్తున్నారు. టీజర్ విడుదలైన వెంటనే విజువల్స్, స్కేల్, యాక్షన్ డిజైన్ అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ… టీజర్ లోని ఒక ముఖ్యమైన యాక్షన్ సీన్ అనేక అనుమానాలు కలిగిస్తుంది. అందులో పాత్రలు గాల్లో తేలుతూ, వేగంగా దాడులు చేసుకోవడం కనిపిస్తుంది. ఈ సీక్వెన్స్, హాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించిన ‘కుంగ్ ఫూ పాండా(Kung Fu Panda)’ యానిమేషన్ మూవీ సిరీస్లోని కొన్ని యాక్షన్ బీట్స్ను పోలి ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
స్టైల్ కాపీ చేశారని, యాక్షన్ బీట్స్ లిఫ్ట్ చేశారని పలు ప్లాట్ఫార్మ్స్లో ట్రోలింగ్ కూడా మొదలైంది. దీంతో వివాదం వేడెక్కడంతో చివరికి దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. “నేను అసలు కుంగ్ ఫూ పాండా సినిమా చూడలేదు. మా టీమ్ కూడా ఈ సీన్ను ఆ చిత్రానికి దగ్గరగా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చేయలేదు. రెండు ఫైట్ సీన్స్ గాల్లోనే సాగేలా ఉండటంతో కొందరికి పోలిక అనిపించి ఉండొచ్చు. కానీ మా సీన్కు కారణం కథలో స్పష్టంగా తెలుస్తుంది అని అన్నారు. అంటే కుంగ్ ఫూ పాండాతో ఈ యాక్షన్ సీక్వెన్స్కు ఏ సంబంధం లేదని, ఇది పూర్తిగా బాహుబలి కథ డిమాండ్ ప్రకారమే రూపొందించబడిందని దర్శకుడు తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విడుదలయ్యాక బాహుబలి బ్రాండ్ మరలా గ్లోబల్ మార్కెట్ వైపు దూసుకుపోతుందనడంలో సందేహం లేదు.