‘ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఆరోగ్యంపై తీసుకుంటున్న జాగ్రత్తలు చూశాను. వాళ్లు ఆరోగ్యం విషయంలో యూనివర్సల్గా వున్న కొన్ని అంశాలను పరిశీలించి 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఫిట్నెస్ స్టూడియోను స్థాపించాను. ఈ క్రమంలోనే అనేక మంది సినీ పెద్దలు, సెలబ్రిటీలతో పరిచయం అయ్యింది. అలా సినిమాలపై నాకు కూడా ఆసక్తి పెరిగింది’ అన్నారు నిర్మాత చంద్రశేఖర్ మొగుళ్ల. తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా రామ్ మల్లిక్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘అద్భుతం’. ఇటీవల హాట్స్టార్ ఓటీటీలో ఈ చిత్రం విడుదలైంది. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ ‘అమెరికాలో ఉన్నత చదువులు చదివిన నేను నాగార్జున, సుమంత్, రాజశేఖర్, ప్రభాస్, ఎన్టీఆర్లతో పాటు అనేక మంది సినీ ప్రముఖులకు ఫిట్నెస్ ట్రైనర్గా వున్నాను. సినిమాలపై ఆసక్తితో అద్భుతం చిత్రంతో నిర్మాతగా మారాను. ఇటీవల హాట్స్టార్లో విడుదలైన మా చిత్రానికి వస్తున్న స్పందన అద్భుతం. కేవలం తొలి 3 రోజుల్లోనే 100 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ సాధించింది’ అన్నారు.