2009లో ‘అరుంధతి’గా బాక్సాఫీస్ వద్ద అనుష్క చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అనుష్కను నేటికీ అంతా జేజమ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆమె ఇమేజ్పై ఆ పాత్ర ప్రభావం అలాంటిది. సినిమా వచ్చి 17 ఏండ్లయినా గద్వాల్ రాణిగా అనుష్క కనపరచిన రాజసం ఎవరూ మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాను బాలీవుడ్లో పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో ‘అరుంధతి’గా శ్రీలీల నటించనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
తమిళ దర్శకుడు మోహన్రాజాను దర్శకుడిగా పరిశీలిస్తున్నారట. ఇదిలావుంటే.. అసలు జేజమ్మ పాత్రకు శ్రీలీల న్యాయం చేయగలదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఉత్పన్నమవుతున్నాయి. రీమేక్ చేసే బదులు, సీక్వెల్ చేస్తే బావుంటుందని మరికొందరు నెటిజన్స్ సలహాలు కూడా ఇస్తున్నారు. అసలు ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.