Arpit Bala | 2025లో విడుదలైన ‘బర్గద్’ పాటతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ అర్పిత్ బాలా తాజాగా హైదరాబాద్లో జరిగిన లైవ్ కాన్సర్ట్లో వివాదానికి కేంద్రబిందువయ్యాడు. ప్రదర్శన మధ్యలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మార్చి 28న హైదరాబాద్లోని ‘కింగ్డమ్ క్లబ్ అండ్ కిచెన్’లో అర్పిత్ బాలా లైవ్ ప్రదర్శన ఇస్తుండగా, ప్రేక్షకుల్లో నుంచి ఒకరు స్టేజ్ వైపు ప్లాస్టిక్ బాటిల్ విసిరారు. ఆ బాటిల్ నేరుగా అర్పిత్ కంటికి తగలడంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే బాటిల్ విసిరిన వ్యక్తిని గుర్తించి, అతనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, అర్పిత్ ఆ బాటిల్ను తిరిగి ప్రేక్షకుల వైపు విసరడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారు. అంతేకాకుండా ఆ వ్యక్తి వైపు ఉమ్మివేయడం మరింత వివాదానికి దారి తీసింది. “దీన్ని తీసుకెళ్లి నీ చెల్లెలి పెళ్లిలో కట్నంగా ఇవ్వు” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.ఈ ఘటనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు అర్పిత్ ప్రవర్తనను ఖండిస్తుండగా, మరికొందరు అభిమానులు చేసిన చర్య తప్పని, దానికి ప్రతిస్పందనగా ఆయన కోపం సహజమేనని సమర్థిస్తున్నారు.
వివాదం పెరగడంతో అర్పిత్ బాలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించారు. ఇది వివరణ కాదు, నా వైపు జరిగిన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను” అంటూ ఆయన వివరించారు. షో బాగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బాటిల్ వచ్చి కంటికి తగిలింది. అంతకుముందు కూడా కొన్ని బాటిళ్లు విసిరారు. కంటికి తగలడంతో కోపం వచ్చింది. ఆవేశంలో అలా ప్రవర్తించాను అని తెలిపారు. అలాగే, ముఖంపై ఏదైనా విసిరితే అది కేవలం అవమానం మాత్రమే కాదు, ప్రమాదకర పరిస్థితి కూడా. అయితే నేను అలా స్పందించకూడదు. కానీ ప్రేక్షకులు కూడా హద్దులు దాటకూడదు అని స్పష్టం చేశారు. కాగా, హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన అర్పిత్ బాలా ‘రక్లో తుమ్ చుపాకే’, ‘ఇక్ కుడీ’, ‘నహాని’ వంటి పాటలతో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండగా, మే 9న ముంబైలో తన తదుపరి లైవ్ కాన్సర్ట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.