కోల్కతా: ఇషాన్ కట్టర్ నటించిన బాలీవుడ్ ఫిల్మ్ పిప్పా ప్రస్తుతం అమెజాన్లో రిలీజైంది. ఆ ఫిల్మ్లో ఉన్న ఓ బెంగాలీ సాంగ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్(AR Rahman) సంగీతాన్ని అందించారు. అయితే బెంగాలీ కవి కాజి నజ్రుల్ ఇస్లామ్ రాసిన ఓ పాటను ఈ సినిమా కోసం వాడారు. కొత్త బాణీలో ఆ పాటను స్వరపరిచారు.
ఈ సాంగ్పై ప్రస్తుతం బెంగాలీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరార్ ఓయ్ లోహ కపాట్ అన్న ఆ పాట ఇప్పుడు బెంగాల్లో ఓ సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. కవి నజ్రుల్ ఇస్లామ్ మనవడు కాజి అనిర్బన్ ఆ పాటను వ్యతిరేకిస్తున్నారు. సినిమా కోసం పాత కాలం నాటి పాటను ఖూనీ చేసినట్లు ఆయన ఆరోపించారు. పాటను వాడుకునేందుకు పర్మిషన్ ఇచ్చాము కానీ, ఆ సాంగ్ ట్యూన్, రిథమ్ను మార్చేందుకు అనుమతి ఇవ్వలేదని అనిర్బన్ తెలిపారు.
కరార్ ఓయ్ లోహ కపాట్ ఒరిజనల్ పాటను 1922లో కంపోజ్ చేశారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆ పాటను రాశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ ఆర్మీ కూడా 1971 యుద్ధం సమయంలో వాడింది. అయితే బంగ్లా యుద్ధ కథ ఆధారంగా తెరకెక్కిన పిప్పా సినిమాలో ఆ సాంగ్ను వాడుకున్నారు. అయితే కవి నజ్రుల్ ఫాలోవర్స్ మాత్రం తాజా కంపోజిషన్ పై ఫైర్ అవుతున్నారు. పాత పాటలో ఉన్న సారాన్ని మార్చేశారని నజ్రుల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటను సినిమా నుంచి తొలగించాలని ప్రధానిని కూడా కోరారు.
ఒరిజినల్ సాంగ్పై తమకు గౌరవం ఉందని పిప్పా సినీ నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు. 1971 ఇండోపాక్ వార్పై తీసిన ఈ సినిమాను రాజా కృష్ణ మీనన్ తీశారు. కవి నజ్రుల్ 1899లో జన్మించారు. రెబల్ కవిగా ఆయన్ను గుర్తించారు. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ్ బర్దమాన్ జిల్లాలో ఆయన పుట్టారు. ఆయన రాసిన పాటల్ని నజ్రుల్ గీత్గా ప్రాచుర్యం పొందాయి. రబీంద్రనాథ్ ఠాకూర్ తర్వాత ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన బంగ్లాదేశ్ జాతీయ కవిగా అవతరించారు. 1976లో కవి నజ్రుల్ తుది శ్వాస విడిచారు.