ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal). 1990లలో జమ్మూకశ్మీర్లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది.
రానున్న రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా ప్రారంభించే ముందు చాలా పరిశోధనలు చేశామన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ‘నేను, వివేక్ (డైరెక్టర్) (Vivek Agnihotri) ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలను కలిశాం. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి యూఎస్, కెనడా, సౌతాఫ్రికాలో 3 నెలలు ట్రావెల్ చేశాం. ఆ ప్రయాణం అంత సులభమైనదేమి కాదు…ఎందుకంటే మేం కలిసిన వ్యక్తులు అప్పటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఏడ్చేసేవారన్నారు.
సినిమాను చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించాం. అంతేకాదు ప్రచార కార్యక్రమాలకు కూడా అంతగా ఖర్చుపెట్టలేదన్నారు. సినిమాపై దాఖలైన పిల్ను సినిమా విడుదలకు ముందే కోర్టు కొట్టిపారేసిందని చెప్పుకొచ్చారు అభిషేక్ . ఇక సినిమాలో కశ్మీర్ పండిత్ (Kashmir pundit) పాత్రలో నటించిన సీనియర్ దర్శకుడు, నటుడు, నిర్మాత అనుపమ్ ఖేర్ (Anupam Kher) సెట్స్ లో ప్రతీ రోజూ ఏడ్చేవారని, ఈ సినిమా తమకు భావోద్వేగపూరిత ప్రయాణం అని’ చెప్పుకొచ్చారు.