Anupam Kher | ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపునకు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన మద్దతును ప్రకటించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధనాన్ని ఆదా చేయాలని, సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించాలని ప్రధాని చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఆయన జైపూర్ నుండి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణానికి సంబంధించిన ఒక సెల్ఫీ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, ప్రధాని మోదీ చెప్పింది వందకు వంద శాతం నిజమని, ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ పొదుపు చేయడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా కార్ పూలింగ్ అలవాటు చేసుకోవాలని కోరారు. దూర ప్రయాణాలకు విమానాలు, సొంత కార్లను కాకుండా తాను వందే భారత్ రైలును ఎంచుకున్నానని, ఇవి చిన్న ప్రయత్నాలే అయినా దేశంపై పెద్ద ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, అనుపమ్ ఖేర్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీసింది. సాధారణంగా లగ్జరీ కార్లు, విమానాల్లో తిరిగే సెలబ్రిటీలు కేవలం ఒకరోజు ఇలా రైలు ఎక్కి వీడియోలు తీయడం ప్రచార ఆర్భాటమేనని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దేశంలో సాధారణ సామాన్యుడు ఇంధన ధరల భారం మోయలేక ఇబ్బంది పడుతుంటే, సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేని వందే భారత్ లాంటి ప్రీమియం రైలు టికెట్లను కొనుగోలు చేసి ప్రయాణించాలనడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించకుండా ప్రజలను ప్రయాణాలు తగ్గించుకోమనడం ఏంటని, దానికి ఈ నటుడు మద్దతు ఇవ్వడం ఏంటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.