‘మేమంతా ఎంతో ఇష్టపడి ఈ సినిమా తీశాం. చక్కటి మానవ సంబంధాలతో కూడిన అందమైన కథగా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. మౌత్టాక్తో ప్రతి ఒక్కరికి చేరువైంది’ అని అన్నారు నందిని రెడ్డి. ఆమె దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ ‘మంచి కంటెంట్ ఉంటే కుటుంబ ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని ఈ సినిమా నిరూపించింది. కథలోని కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు’ అని పేర్కొంది. ‘ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. కథపై నమ్మకంతో టీమ్ అంతా శ్రమించాం. హృద్యమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది’ అని స్వప్నదత్ చెప్పారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసి మా అమ్మగారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. నటుడిగా ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది’ అన్నారు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తమ ప్రయత్నం సఫలమైందని, అన్ని కేంద్రాల్లో ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారని ప్రియాంకదత్ తెలిపారు. తన కెరీర్లో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని కథానాయిక మాళవిక నాయర్ ఆనందం వ్యక్తం చేసింది.