Toxic Movie | రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ నేత కే. అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో మహిళలను తప్పుగా చిత్రీకరించారని, ఇది యువతపై చెడు ప్రభావం చూపుతుందని ఆయన విమర్శించారు.
కోయంబత్తూరులో జరిగిన ఓ బహిరంగ సభలో అన్నామలై మాట్లాడుతూ సినిమాల ప్రభావం సమాజంపై ఏ విధంగా ఉంటుందో ప్రస్తావించారు. “నిన్న ఓ సినిమా గురించి విన్నాను. అది మొదటి రోజే రూ. 104 కోట్లు వసూలు చేసింది. మనం ఎప్పుడూ మంచి విషయాలు మాట్లాడాలని చూస్తాం, కానీ ఏకంగా సినిమా పేరునే ‘టాక్సిక్’ అని పెట్టుకున్నారు. ఈ చిత్రం మహిళలను తప్పుగా చూపిస్తూనే భారీగా డబ్బు సంపాదిస్తోంది” అని ఆయన మండిపడ్డారు.
ఇలాంటి చిత్రాలను విద్యార్థులు, యువత చూస్తే దేశం ఏ దిశగా పయనిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు నగరాల్లో మహిళల భద్రత గురించి చర్చిస్తున్నామని, మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇలాంటి చిత్రాలకు ఎలా అనుమతి ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. సినిమాలలో మహిళలను గౌరవించే విధానం ఉండాలని, సర్టిఫికేషన్ విషయంలో సెన్సార్ బోర్డ్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించినప్పటికీ, దీనిలోని అభ్యంతరకర సన్నివేశాలు, హింస మరియు మహిళల చిత్రణపై ప్రస్తుతం సర్వత్ర చర్చ జరుగుతోంది.