‘జాంబిరెడ్డి’ చిత్రంతో సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేసింది కథానాయిక ఆనంది. ఈ సినిమాతో ఆరేళ్ల తర్వాత తెలుగులో విజయాన్ని అందుకున్న ఆమె తాజాగా మరో విలక్షణ పాత్రలో కనిపించబోతున్నది. సుధీర్బాబు కథానాయకుడిగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర తాలూకు వీడియో గ్లిమ్స్ను శుక్రవారం చిత్రబృందం విడుదలచేసింది. ఈ సినిమాలో సోడాల శ్రీదేవి పాత్రలో ఆనంది నటించబోతున్నట్లు తెలిపింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘సూరిబాబు, శ్రీదేవి అనే జంట కథ ఇది. భిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఎలా ప్రేమలో పడ్డారు? వారి ప్రేమప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఈ చిత్ర ఇతివృత్తం. వినూత్నమైన కథాంశంతో దర్శకుడు కరుణకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మందులోడా’ పాటకు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యాందత్ సైనుద్దీన్.