‘తమిళనాడులో జరిగిన ఓ యథార్థ సంఘటన స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించా. మారుతి శైలిలో వినోదాన్ని జోడించి కథ తయారుచేశాను’ అని అన్నారు సాయిరాజేష్. ఆయన దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న చిత్రం ‘బేబీ’. ఎస్కేఎన్, మారుతి సంయుక్తంగా నిర్మించారు. త్వరలో విడుదలకానుంది. సోమవారం టీజర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం ఇష్టంతో కష్టపడ్డాను. నా కెరీర్లోనే సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. ఇందులో విభిన్నమైన లుక్స్లో కనిపిస్తాను. కథలోని ఎమోషన్స్తో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు’ అని తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించామని..‘బేబీ’ ఓ అందమైన ప్రేమకథా చిత్రంగా మెప్పిస్తుందని నిర్మాత ఎస్కేఎన్ పేర్కొన్నారు.
ఆర్థికపరమైన లెక్కలు వేసుకోకుండా తీసిన చిత్రమిదని, హృదయాన్ని తడిమే కథను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశామని దర్శకుడు మారుతి తెలిపారు. తన కెరీర్లోనే బెస్ట్ రోల్ ఇదని కథానాయిక వైష్ణవి ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకులు అనిల్ రావిపూడి, హరీష్శంకర్, వశిష్ట, వెంకటేష్ మహా, వీఐ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.