ముంబై: బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్ పోలీస్ బాడీగార్డ్ కోట్లకు కోట్లు సంపాదించిన విషయం తెలిసి అక్కడి డిపార్ట్మెంట్ ఆశ్చర్యపోయింది. జితేంద్ర షిండే అనే ఆ కానిస్టేబుల్ ఆరేళ్లుగా బిగ్ బీకి బాడీగార్డ్గా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతను ప్రతి ఏడాది రూ.1.5 కోట్లు సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది. షిండే భారీగా సంపాదిస్తున్నాడని ఈ మధ్య వార్తలు రావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ అంతర్గత విచారణ జరిపింది. విచారణలో ఇది నిజమని తేలినా.. అంత డబ్బు అతనికి ఎలా వచ్చిందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బిగ్ బీనే అతనికి ఈ మొత్తం ఇచ్చాడా లేదా అన్నది కూడా తెలియలేదు.
అయితే తన భార్య మరో సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతోందని షిండే చెబుతున్నాడు. ఈ ఏజెన్సీ పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలకు సెక్యూరిటీని అందిస్తోంది. తన భార్య పేరు మీదే ఈ ఏజెన్సీ నడుస్తోందని షిండే చెప్పాడు. తనకు అంత భారీ మొత్తాన్ని అమితాబ్ ఇవ్వలేదని కూడా షిండే విచారణలో తెలిపాడు. అయితే ఓ పోలీసును ఏ స్థానంలో అయినా ఐదేళ్లకు మించి ఉంచకూడదు. షిండే మాత్రం ఇప్పటికే ఆరేళ్లుగా బిగ్ బీ బాడీగార్డ్గా పని చేస్తున్నాడు. ఇప్పుడతన్ని దక్షిణ ముంబైలోని పోలీస్ స్టేషన్ను బదిలీ చేశారు. అమితాబ్ ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఎప్పుడూ ఇద్దరు కానిస్టేబుల్స్ అతని వెంట ఉంటారు.