Kantara | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలోని ‘వరాహరూపం దైవ వరిష్టం’ అనే పాటపై కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు నిషేధం విధించింది. అనుమతి లేకుండా ఈ పాటను ఎక్కడా ప్రదర్శించరాదని ఆదేశించింది.
భక్తిభావాలతో ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేస్తున్న ‘వరాహరూపం దైవ వరిష్టం’ పాటని కాపీ కొట్టారంటూ ఇటీవల కేరళకు చెందిన మ్యూజిక్బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తమ బృందం రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’ పాటను కంపోజ్ చేశారంటూ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. థాయికుడమ్ బ్రిడ్జ్ అనుమతి లేకుండా ఈ పాటను థియేటర్, ఓటీటీ, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడా ప్రదర్శించరాదని తెలిపింది. ఈ విషయాన్ని థాయికుడమ్ బ్రిడ్జ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ మేరకు పోస్టు చేసింది.
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో విడుదలైన విషయం తెలిసిందే. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది.