అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూయెల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేష్ శశి దర్శకుడు. జీఏటు పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘ధీంతననా..’ అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ‘నీ అడుగుల వెంట, నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటునా’ అంటూ సాగుతుందీ పాట. ఈ పాటను అచ్చు రాజమణి స్వరకల్పనలో పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా..సిధ్ శ్రీరామ్ పాడారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నారు.