Allu Arjun-Sanjay Leela Bhansali | ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈయన తన మార్కెట్ను ఇండియా మొత్తం పెంచుకునే దృష్టిలో ఉన్నాడు. అందుకనే ఈ సారి పుష్ప పార్ట్-2 షూటింగ్ తొందరగా పూర్తి చేసి ప్రమోషన్లకు ఎక్కువ రోజులు కేటాయించాలని ప్లాన్ వేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే బన్నీ నెక్ట్స్ సినిమాపై ఇప్పటికి ఎలాంటి క్లారిటీ లేదు. బోయపాటితో తన తదుపరి సినిమా ఉంటుందని గతం నుంచే వార్తలు వస్తున్నాయి. తాజాగా బన్నీ నెక్ట్స్ సినిమాపై ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.
తాజాగా బన్నీ బాలీవుడ్లోని ప్రముఖ దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నాడట.. అంతే కాకుండా రీసెంట్గా బాంబే వెళ్ళి ఆ దర్శకుడితో చర్చలు కూడా జరిపాడని సమాచారం. ఇంతకు ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు సంజయ్ లీలా భన్సాలీ. వాస్తవిక కథలను అందంగా, అందరికి అర్థమయ్యేవిధంగా తెరపై చూపించడంలో భన్సాలీ దిట్ట. ఈయన టేకింగ్గాని, విజువలైజేషన్ కాని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈయన సినిమాలలో ప్రధాన పాత్రలకు గొప్ప క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అందుకే ఈయనతో కలిసి పనిచేయడానికి బాలీవుడ్ హీరోలు ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలో బన్నీ, భన్సాలీని కలవడం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చినీయాంశమైంది. వీళ్ళ కాంబో మాత్రం సెట్టయితే బన్నీరేంజ్ ఇండియా నలుమూలల వ్యాపిస్తుంది అంటూ నెటీజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
భన్సాలీ లేటెస్ట్ చిత్రం గంగూబాయి కఠియావాడి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించింది. ఈ చిత్రంలో ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించింది. ఇక ‘పుష్ప ది రూల్’ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప ది రైజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఆ ఏడాది ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది.