Mrunal Thakur | సెప్టెంబర్లో దుబాయి వేదికగా సైమా 2023 అవార్డుల ప్రధానోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు తాజాగా బయటికి వచ్చాయి. అందులో మృణాళ్ ఠాకూర్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఫిలిం క్రిటిక్స్ విభాగంలో ‘సీతారామం’ సినిమాకు గాను ఉత్తమనటి అవార్డును మృణాళ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ ‘సీతారామం’ నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఉత్తమనటిగా నేను అందుకుంటున్న తొలి అవార్డు ఇది. అందుకే దర్శక, నిర్మాతలకు, తోటి నటీనటులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అను రాఘవపూడి నాలో తెలుగమ్మాయిని చూశారు. అలాగే తీర్చిదిద్దారు. చివరికి అది ఏ స్థాయికి వెళ్లిందంటే, నేను నిజంగా తెలుగమ్మాయినే అనుకునేంత స్థాయికి.
హైదరాబాద్ని నా ఊరుగా ఫీలైపోయేదాన్ని. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారా? అంటూ ముంబయ్ నిర్మాతలు ఫోన్లు కూడా చేసేవారు. నిజం చెప్పాలంటే, నిజంగానే హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుంది.’ అంటూ ఆనందంగా చెప్పింది మృణాళ్. ఇదిలావుండగా.. ఉత్తమనటి అవార్డును మృణాళ్కి అందజేసిన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ గతంలో ఓ హీరోయిన్ని తెలుగబ్బాయిని పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలుగా రా.. అని దీవించాను. ఆ అమ్మాయి నిజంగా తెలుగింటికోడలైపోయింది. ఇప్పుడు నీక్కూడా నా దీవెన. నువ్వుకూడా హైదరాబాద్కి షిఫ్టయిపోవాలి’ అంటూ చమత్కరించారు. కొంపదీసి అరవింద్ దీవెన మళ్లీ ఫలించి, మృణాళ్ కూడా తెలుగింటి కోడలైపోతే? అంటూ ఈ విషయంపై పలువురు సరదాగా సంభాషించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతున్నది.