Naresh Itlu Maredumilli Prajaneekam Teaser | ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు అల్లరి నరేష్. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ తరువాత కామెడీ సినిమాలకు నరేష్ కేరాఫ్ అడ్రస్గా నిలిచాడు. ఈయన నుండి సినిమా వస్తుందటే రెండు గంటలు హాయిగా నవ్వుకోవచ్చు అని ప్రేక్షకులు భావిస్తుంటుంటారు. అయితే గతకొంత కాలంగా ఈయన సినిమాలు ఒకే పంతాలో ఉండటంతో ప్రేక్షకులు నరేష్ సినిమాలను థియేటర్లలో చూడటానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. దాంతో నరేష్ రోటీన్కు భిన్నంగా గతేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీని పక్కన పెట్టి మొదటి సారి పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. కమర్షియల్గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం అనే రూరల్ బ్యాక్డ్రాప్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఏఆర్ మొహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఇవన్నీ ట్రైబల్ విలేజెస్.. వీళ్ళలో ఎక్కువమంది జీవితంలో ఒక్కసారి కూడా ఓటు వేయని వారే ఉన్నారు’ అంటూ టీజర్ ప్రారంభమైంది. ‘ఏదో పండగ చందాలకు అడుకున్నట్లు మనం డబ్బాలేసుకుని అన్ ఎడ్యుకేటెడ్ ఫెల్లోస్ను ఓటేయండి బాబు అని అడుక్కోవడం ఏంటి సార్’ అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘సాయం చేస్తే మనిషి, దాడి చేస్తే మృగం. మేము మనుషులం సర్. మీరు మనుషులైతే సాయం చేయండి’ అంటూ ఆనంది పలికే సంభాషణలు ఆ ట్రైబల్స్ సాయం కోసం ఎంత ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది. ’90 కిలో మీటర్ల ఫారెస్ట్, 150 కిలో మీటర్ల చుట్టుకోలత. అక్కడికెళ్తే ఎవ్వరు వెనక్కి తిరిగి రాలేరు’. ‘మాకు న్యాయం జరగకపోతే ఎవ్వరిని వదలం’. అంటూ వచ్చే డైలాగ్స్ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. టీజర్ చివర్లో ‘పాతిక కిలోమీటర్లు ఇవతలకు వస్తే గాని వీళ్ళు ఇలా బతుకుతున్నారని మనకు కూడా తెలియలేదు. వీళ్ళను చూస్తుంటే బాధపడాలో, జాలిపడాలో కూడా తెలియట్లేదు’ మాస్టారు అంటూ అల్లరి నరేష్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
మొత్తంగా టీజర్ను గమనిస్తే మారేడుమిల్లి అనే ఓ ఊరు ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా అడవుల మధ్యలో బతుకుతూ ఉంటుంది. అక్కడికి ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది? ఓట్లు వేయించడానికి వెళ్ళిన నరేష్ ఎలాంటి పాట్లు పడ్డాడు అనే విధంగా సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. మరో సారి నరేష్ కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆనంది హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడీయోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.