సినిమాల్లో తాను ఎక్కువగా సీరియస్ పాత్రల్లో కనిపించినా..వ్యక్తిగతంగా మాత్రం కామెడీని ఇష్టపడతానని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్. ఆమె తాజా చిత్రం ‘డార్లింగ్స్’ ఆగస్ట్ 5న ఓటీటీలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.
కెరీర్లో ఇప్పటివరకు పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రను చేసే అవకాశం రాకపోవడం దురదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. అలియాభట్ మాట్లాడుతూ ‘చిన్నతనం నుంచి కామెడీ సినిమాల్ని ఇష్టపడేదాన్ని. గోవింద, కరిష్మాకపూర్ నా అభిమాన తారలుగా ఉండేవారు. హిందీతో పాటు హాలీవుడ్ కామిక్ చిత్రాలంటే ఎంతో మక్కువ ఉండేది.
నటిగా మారిన తర్వాత మాత్రం కామెడీ రోల్స్ పోషించే అవకాశం రాలేదు. కామెడీ జోనర్ ఎప్పటికీ నా ఫేవరేట్. కెరీర్లో ఫుల్లెంగ్త్ కామెడీ సినిమా చేయాలనే కోరిక ఒక్కటి మిగిలిపోయింది’ అని చెప్పింది. ‘డార్లింగ్స్’ సినిమాలో నటించడమే కాకుండా చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా మారింది అలియాభట్. నిర్మాతగా ఆమెకిది తొలి చిత్రం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సినిమాతో పాటు అలియాభట్ ‘బ్రహ్మాస్త్ర’ ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.