పైకి మాత్రమే పట్టించుకోనట్టు నిర్లక్ష్యంగా కనిపిస్తారు కానీ.. నిరంతర విమర్శలు ఎంతటి వారినైనా మానసికంగా కృంగదీస్తాయి. వారిలో సినిమావాళ్లేం మినహాయింపు కాదు. పాపం.. ఈ విమర్శల కారణంగానే విసిగిపోయింది బాలీవుడ్ భామ అలియాభట్. దాంతో సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నారామె. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ వేదికలపై అలియా ఫ్యాషన్ షోలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. అలియా ధరించిన వస్ర్తాలపై, ప్రదర్శించిన తీరుతెన్నులపై కొందరు విమర్శలు గుప్పిస్తే.. మరికొందరు వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యలు చేశారు.
ఈ ట్రోల్స్ ఆమెను మానసికంగా కలవరానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అలియా నిశ్చయించుకున్నారట. ‘ఇకపై నా దృష్టి అంతా కెరీర్ పైనే. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’ నా కెరీర్లోనే అద్భుతమైన సినిమాగా నిలువనున్నది. ఇందులో నా భర్త రణ్బీర్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందాన్నిస్తుంది. ఇకనుంచి ప్రైవేట్ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నా. కేవలం నా సినిమాల ప్రమోషన్స్లో మాత్రమే పాల్గొంటా. మిగతా సమయమంతా ఇక కుటుంబానికే’ అంటూ చెప్పుకొచ్చారు అలియాభట్.