తెలుగు అగ్ర కథానాయకుల సినిమాలన్నీ ఇకపై పాన్ ఇండియా చిత్రాలే. ఇక ఆ సినిమాలను పాన్ ఇండియా అని ప్రత్యేకంగా ప్రకటించాల్సిన పనిలేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్…ఇలా స్టార్స్ అంతా తమ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ప్లాన్ చేసుకుంటున్నారు.
మరి ఈ చిత్రాల్లో ఆ భారీతనం కనిపించాలంటే బాలీవుడ్ నాయికలే కావాలి. వాళ్లతో వ్యవహారం మన దక్షిణాది తారల్లా కాదు కాస్త క్లిష్టంగా ఉంటుంది. వాళ్ల డేట్స్ ఉన్న పళంగా అడ్జస్ట్ అవవు. హీరోలే వేచి చూడాల్సీ రావొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకే ఈ పరిస్థితి ఎదురైందని టాలీవుడ్ టాక్.
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో కొత్త సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా ఆలియా భట్ ను ఎంపిక చేశారు. ఆలియా కూడా ఈ సినిమా గురించి మాట్లాడింది. గంగూభాయ్ కతియావాడి ప్రచార కార్యక్రమాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు ప్రాజెక్ట్ లో జాయిన్ కాలేనని తాజాగా కబురు పంపిందట ఆలియా.
గంగూభాయ్ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుకగా పాల్గొంటున్నది ఆలియా. ఈ కారణంగా మరికొంత ఆలస్యంగా షూటింగ్ కు వస్తానని వర్తమానం పంపిందట ఈ బాలీవుడ్ నాయిక. వీలైనంత త్వరగా షూటింగ్ కు వెళ్లాలనుకుంటున్న ఎన్టీఆర్ అండ్ టీమ్ కు ఈ సమస్య స్పీడ్ బ్రేకర్ గా మారింది. దీంతో ప్రత్యామ్నాయం చూస్తున్నారట చిత్ర బృందం. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది.