అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. ఈ చిత్రాన్ని అలీబాబ, కొణతాల మోహనన్ కుమార్, ఆర్. శ్రీచరణ్ నిర్మిస్తున్నారు. శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఈ సినిమా ఆహా ఓటీటీ ద్వారా ఈ నెల 28 విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటుడు అలీ మాట్లాడుతూ…‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం వికృతి ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం.
ఈ కథలో సమాజానికి పనికొచ్చే ఓ మంచి సందేశం ఉంటుంది. నరేష్, నా పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. 27 ఏళ్ల తర్వాత మంజు భార్గవి గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. చాలా మంది పేరున్న నటీనటులు ఈ సినిమాలో తమ నటనతో మిమ్మల్ని అలరిస్తారు’ అన్నారు.
దర్శకుడు శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ..‘దాదాపు 1200 చిత్రాల్లో నటించిన అలీ నిర్మాతగా చేస్తున్న మొదటి చిత్రానికి దర్శకుడిని కావడం సంతోషంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అచ్చి రెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, కమెడియన్ బ్రహ్మానందం తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.