Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అక్షయ్ కుమార్ బుధవారం తెల్లవారుజామునే ఉజ్జయినిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు అత్తగారు, సీనియర్ నటి డింపుల్ కపాడియా కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ పర్యటన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, కేవలం తన కోసమే కాకుండా దేశ ప్రజలందరి కోసం, తన కుటుంబం కోసం ప్రార్థనలు చేశానని తెలిపారు. మన దేశం ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటూ, ప్రగతి పథంలో దూసుకుపోవాలని తాను కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే, అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘భూత్ బంగ్లా’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంలో టబు, పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్, జిస్సు సేన్గుప్తా, అస్రాని, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ భాగస్వామ్యంతో బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో పవిత్ర శిప్రా నది ఒడ్డున వెలసిన మహాకాళేశ్వరాలయం అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3:30 నుండి 5:30 గంటల మధ్య జరిగే భస్మ హారతి పూజకు ఎంతో విశిష్టత ఉంది. ఆలయ సాంప్రదాయాల ప్రకారం తెల్లవారుజామున బాబా మహాకాల్ ఆలయ తలుపులు తెరిచి, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతో కూడిన పంచామృతాలతో స్వామివారికి పవిత్ర స్నానం చేయించి ఈ పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
#WATCH | Madhya Pradesh: Actor Akshay Kumar, along with his mother-in-law and veteran actor Dimple Kapadia, visited Shri Mahakaleshwar Temple in Ujjain and offered prayers today. pic.twitter.com/Q21mMHWmZy
— ANI (@ANI) April 1, 2026