అక్కినేని వారసుడు నాగచైతన్య, సమంత విడాకులు తెలుగు ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించాయి. కొన్నిరోజులుగా ఈ విషయంలో వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ తామిద్దరం విడిపోతున్నట్లు ఈ లవ్ కపుల్ ప్రకటించింది. ఈ వార్తపై నాగచైత్యన్య తండ్రి, అగ్రకథానాయకుడు నాగార్జున స్పందించారు. ఈ విషయం విని తన గుండె బరువెక్కిందన్న నాగార్జున.. చైతన్య, సామ్ విడిపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు.
భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు వారి వ్యక్తిగతమైనవని చెప్పిన నాగ్.. చైతన్య, సామ్ ఇద్దరూ తనకు చాలా ఆప్తులన్నారు. అలాగే తమ కుటుంబంతో కలిసి సామ్ గడిపిన క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేమని, ఆమె ఎప్పటికీ తమ మనసుల్లో ఉంటుందని ప్రకటించారు. వీరిద్దరికీ ఈ పరిస్థితులు తట్టుకునే బలం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.