Akhanda 2 | అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 05న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు కేవలం మూడు రోజులు ముందుగా ఏపీ ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించడంతో పాటు, బెనిఫిట్ షోలు (Paid Premieres) వేసుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీలో డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది. ఈ స్పెషల్ షోకు టికెట్ ధర రూ. 600గా నిర్ణయించారు. అలాగే డిసెంబర్ 5న సినిమా విడుదలైన తర్వాత, తొలి పది రోజుల పాటు పెరిగిన ధరలు అమలులో ఉంటాయి. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ. 75 పెంపు. మల్టీప్లెక్స్లలో టికెట్ ధరపై రూ. 100 పెంపునకు అనుమతినిచ్చింది.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తుందా అనే ఆసక్తి నెలకొంది. గతంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి. ఓజీ సినిమా సమయంలో కొమటిరెడ్డి మాట్లాడుతూ.. ఇకపై తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఉండదని తెలిపాడు. అయితే ఇప్పుడు అఖండ 2 టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తాడా లేదా అనేది చూడాలి.