బాలీవుడ్ స్టార్ హీరోల మధ్య స్నేహం, సఖ్యత ఉన్నాయని చెప్పారు హీరో అజయ్ దేవగణ్. తాము తరుచూ కలవకపోయినా అవసరం వస్తే ఒకరి కోసం మరొకరు ముందుకొస్తారని అజయ్ తెలిపారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ తనకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటారని చెప్పారు అజయ్. ఆయన హీరోగా నటించిన ‘భోలా’ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో టబూ కీలక పాత్రను పోషించారు. కార్తీ హీరోగా నటించిన తమిళ హిట్ మూవీ ‘ఖైథీ’ రీమేక్గా ‘భోలా’ తెరకెక్కుతున్నది. తోటి హీరోలతో తను స్నేహం, సినిమాలపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీపై తాజాగా స్పందించారు అజయ్ దేవగణ్. ఆయన మాట్లాడుతూ…‘సినిమాలను విమర్శించాలి, హీరోల మధ్య విభేదాల గురించి తెలుసుకోవాలి అనే ఉత్సాహం సాధారణ ప్రేక్షకులకు ఉండదు. వాళ్లు ముందు ట్రైలర్ చూస్తారు. నచ్చితే థియేటర్లో సినిమాకు వెళ్తారు. చూసిన సినిమా ఎలా ఉందని స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అంతవరకే వారు ఆసక్తి చూపిస్తారు. సోషల్ మీడియాలో తమ విశ్లేషణలు చేయరు. కొంతమంది మాత్రమే ప్రతి సందర్భంలో సినిమాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారు. హీరోలుగా మేమంతా కలిసే ఉంటాం. అవసరంలో ఉంటే తప్పకుండా ఒకరి కోసం మరొకరం స్పందిస్తాం’ అని చెప్పారు.