Keerthy Suresh | సోషల్మీడియాలో వచ్చే విమర్శల్ని తాను అస్సలు పట్టించుకోనని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. నెగెటివ్ విషయాలు తనపై ఏ మాత్రం ప్రభావం చూపవని ఆమె పేర్కొంది. ‘మహానటి’ సినిమా సమయంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, అయితే సావిత్రి పాత్ర పోషించినందుకు ఎంతో గుర్తింపు దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది.
ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘మహానటి సావిత్రి పాత్రను పోషించడానికి తొలుత చాలా భయపడ్డా. దర్శకుడు నాగ్అశ్విన్ నాలో ధైర్యాన్ని నింపారు. అయితే ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సోషల్మీడియాలో నాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. సావిత్రి పాత్రకు నేను రాంగ్ ఛాయిస్ అంటూ కొంత మంది విమర్శలు చేశారు. అయితే వాటి గురించి నేను అస్సలు పట్టించుకోలేదు. అంతిమంగా నా కష్టానికి ప్రతిఫలం లభించింది. నా కెరీర్లోనే ‘మహానటి’ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. విమర్శల గురించి ఆలోచిస్తే అడుగు ముందుకువేయలేమన్నది నా ఫిలాసఫీ’ అని పేర్కొంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ‘దసరా’ చిత్రం ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.