సినిమాల్లో అవకాశాలు లేక పోవడం తో టీవీ రియాల్టో షోలో పాల్గొనాల్సి వస్తున్నదని అంటున్నారు విలన్ రాహుల్దేవ్. పలు హిట్ చిత్రాల్లో ప్రతి నాయకుడిగా ఆకట్టుకున్నారాయన. రాహుల్ దేవ్ నటించిన ‘సింహాద్రి’, ‘మాస్’, ‘అతడు’, ‘ఎవడు’, ‘లౌక్యం’ లాంటి చిత్రాలెన్నో ఘన విజయాలు సాధించాయి. భార్య చనిపోయిన తర్వాత కొంతకాలం పిల్లల సంరక్షణ కోసం పరిశ్రమకు దూరమయ్యారు రాహుల్. అడపాదడపా నటిస్తూ వచ్చారు.
దీంతో అవకాశాలు తగ్గాయి. తప్పని పరిస్థితుల్లో ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొంటున్నారు. రాహుల్ దేవ్ మాట్లాడుతూ…‘మా కుటుంబంలో జరిగిన ఓ విషాధం వల్ల కొంతకాలం పరిమితంగా సినిమాలు చేశాను. ఇక్కడ పరిణామాలు వేగంగా మారిపోతాయి కదా. అందుకే నన్ను కూడా త్వరగానే మర్చిపోయారు. ఇన్ని చిత్రాల్లో నటించిన నేను తప్పక టీవీ షోలో పాల్గొనాల్సి వస్తున్నది. ఇబ్బందికర పరిస్థితుల్లో సునీల్ శెట్టి, దర్శకులు నిఖిల్ అద్వానీ, అనీస్ బాజ్మీ లాంటి మిత్రులు అండగా నిలబడ్డారు’ అని చెప్పారు.