Adivi Sesh | టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు. ఆయన సినిమా వస్తుందంటే కచ్చితంగా కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. తాజాగా ‘డెకాయిట్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శేష్, ప్రమోషన్ల సందర్భంగా తనకు ఎదురైన ట్రోలింగ్ అనుభవాన్ని బయటపెట్టారు. గతంలో గూఢచారి 2 గురించి ట్వీట్ చేస్తూ ‘ఫ్యాన్స్’ అనే పదాన్ని వాడినప్పుడు ఒక నెటిజన్ చేసిన కామెంట్ తనను ఆలోచింపజేసిందని శేష్ తెలిపారు. “అసలు నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా?” అని వ్యంగ్యంగా అడిగిన ఆ కామెంట్ తనకు కొంచెం బాధ కలిగించిందని చెప్పారు.నేను గూఢచారి ఫ్రాంచైజీని ఇష్టపడే ప్రేక్షకుల గురించి మాట్లాడాను. కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని నన్ను విమర్శించడం జరిగింది. అయినా నేను తగ్గకుండా, నా క్రెడిబిలిటీనే నా బలం అని సమాధానం ఇచ్చాను అని శేష్ గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా తనకు స్వీయ ప్రచారం చేయడం ఇష్టం ఉండదని శేష్ స్పష్టం చేశారు. నేను చాలా సింపుల్గా ఉండాలని ఇష్టపడతాను. అలాంటి వ్యక్తికి ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో కూడా కొన్నిసార్లు అర్థం కాదు అని తెలిపారు. అయితే ఈ సంఘటన తనను మరింత బలంగా మారేలా చేసిందని చెప్పారు. ఏ సినిమాకైనా అసలైన పరీక్ష ‘మండే టెస్ట్’ అని ఇండస్ట్రీలో చెబుతారు. ఈ విషయంలో ‘డెకాయిట్’ ఘనవిజయం సాధించిందని శేష్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం థియేటర్లకు IPL, ఓటీటీ, సోషల్ మీడియా వంటి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమా రెండో వారం కూడా బలంగా నిలబడటం విశేషమన్నారు.
షారుఖ్ ఖాన్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల మధ్య మా సినిమా నిలబడటం చాలా పెద్ద విషయం అని శేష్ పేర్కొన్నారు. అడివి శేష్ కెరీర్ను పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ భిన్నమైన కథలను ఎంచుకుంటూ వచ్చారు. క్షణం, గూఢచారి, మేజర్ వంటి సినిమాల నుంచి ‘డెకాయిట్’ వరకు ప్రతి చిత్రం ఒక కొత్త అనుభూతిని అందించింది.మాస్ ఎలిమెంట్స్ కంటే కథా బలం మీదే ఆధారపడుతూ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించవచ్చని శేష్ మరోసారి నిరూపించారు. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో ‘డెకాయిట్’ సక్సెస్ కావడం ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.