పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఆది పురుష్’ విడుదల విషయంలో స్పష్టత కొరవడింది. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాలి. కానీ తాజాగా ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందంటూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్నది. టాప్ క్రిటిక్స్ కొందరు ఓ పెద్ద సినిమా సంక్రాంతి బరి నుంచి వైదొలిగింది అంటూ పోస్ట్లు చేయడం దుమారం రేపింది. తెలుగులో చిత్ర పంపిణీదారులకు ఈ సమాచారం అందించారని తెలుస్తున్నది.
ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి గ్రాఫిక్స్, పాత్రల చిత్రణ తదితర అంశాలపై విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవనేది ప్రధాన ఆక్షేపణ అయ్యింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే సినిమా విడుదలను వాయిదా వేశారనే మాటలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజులు ఆలస్యమైనా మేకింగ్ సరిచూసుకుని అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తిపరిచేలా సినిమాను తీర్చిదిద్దాలని చిత్రబృందం భావిస్తున్నారట. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇస్తారని అంతా ఆశిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వెర్షన్లో విడుదల చేయబోతున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్ నిర్మాత. రామాయణ నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తుండగా..రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.