కొవిడ్ నష్టాల నుంచి బయటపడి వారానికి నాలుగైదు సినిమాలతో క్రమక్రమంగా థియేటర్స్ వ్యవస్థలో పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. అయినా కొందరు నిర్మాతలు మాత్రం థియేటర్స్ కంటే ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. తమ సినిమాల్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనే విడుదలచేస్తున్నారు. ఆ కోవలో వచ్చిన సినిమానే అద్భుతం. తేజ సజ్జా, రాజశేఖర్ తనయ శివానీ నాయకానాయికలుగా నటించారు. దర్శకుడు ప్రశాంత్వర్మ కథను అందించారు. మల్లిక్రామ్ నిర్దేశకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనేక అవాంతరాలను దాటుకొని విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…
సూర్య(తేజ సజ్జా) ఓ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తుంటాడు. సంగీతకారుడిగా పేరు తెచ్చుకోవాలని కలలుకంటాడు. తాను చేసిన ఓ తప్పు వల్ల తండ్రి చనిపోవడంతో మ్యూజిక్ను పక్కనపెడతాడు. తండ్రి చావుకు తానే కారణమంటూ అందరూ నిందిస్తుండటంతో చనిపోవాలని అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమై తన ఫోన్కు తానే మెసేజ్ పంపించుకుంటాడు.కానీ ఆ మెసేజ్ వెన్నెల (శివానీ)అనే అమ్మాయి ఫోన్కు వెళుతుంది. పరీక్షలో ఫెయిలైన వెన్నెల కూడా అదే సమయంలో చనిపోవాలని అనుకుంటుంది. కానీ సూర్య పంపించిన మెసేజ్తో తన ప్రయత్నాన్ని విరమిస్తుంది. ఇద్దరు వాడుతున్నది ఒకే ఫోన్ నంబర్ అనే నిజం వారికి తెలుస్తుంది. కానీ సూర్య 2019లో ఉండగా…వెన్నెల 2014లో ఉంటారు. అది ఎలా సాధ్యమైంది.. ఒకరినొకరు ఇష్టపడ్డ వారు ఏ విధంగా కలుసుకున్నారు?సూర్య తండ్రి చావుకు కారణమెవరు?సూర్య గతంలో ప్రేమించిన ఓ యువతి, వెన్నెల ఒక్కరేనా? సూర్య సహకారంతో వెన్నెల తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నదన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
టైమ్ ట్రావెల్, క్రాస్ టైమ్ కనెక్షన్ కథాంశాలతో హాలీవుడ్లో చాలా సినిమాలొచ్చాయి. ఈ జోనర్ను ఎంచుకొని అద్భుతం సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మల్లిక్రామ్. ఓ జంట ప్రేమకథకు గతం, వర్తమాన కాలాలను ముడిపెడుతూ కథానాన్ని అల్లుకున్నారు.
ఇద్దరు ఒకే ఫోన్ నంబర్ వాడటం..ఒకే ప్రదేశంలో వేర్వేరు టైమ్ పీరియడ్స్లో ఉంటూ ఒకరినొకరు మాట్లాడుకోవడం అనే పాయింట్తో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అది ఎలా సాధ్యమనే సస్సెన్స్ను కొనసాగిస్తూనే సత్య కామెడీతో ప్రథమార్థాన్ని సరదాగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ద్వితీయార్థంలో మాత్రం పట్టువదిలేశారు దర్శకుడు. విదేశాల్లో చదవడానికి ఏగ్జామ్ పాస్ కావడానికి వెన్నెల పడే కష్టాలు, ఆమెకు పెళ్లిచేయడానికి తండ్రి ప్రయత్నించే సన్నివేశాల్లో డ్రామా, వినోదం రెండుసరిగా పండలేదు. ట్రాక్ తప్పుతూ వెళ్లిన కథ మళ్లీ పతాక ఘట్టాల ముందు సూర్య తండ్రి చావుకు కారణమెవరో తెలిసే సీన్ గాడిన పడినట్లు అనిపిస్తుంది. భిన్నమైన ముగింపుతో సినిమాకు శుభంకార్డు వేసే అవకాశం ఉన్నా..కమర్షియల్ సూత్రాలను ఫాలో అయిన చిత్రబృందం రొటీన్గా నాయకానాయికలు కలుసుకున్నట్లుగా చూపించారు. గ్యాలరీ : | నందితా శ్వేత గ్లామర్ ఫొటోలు..
సైన్స్ఫిక్షన్ సినిమాల్లో లాజిక్ల కంటే మ్యాజిక్ ఎక్కువగా కనిపిస్తుంది. సైన్స్, భక్తి ఏదో ఒక అంశాన్ని ముడిపెడుతూ కథను ఆసక్తికరంగా చెప్పడంపైనే ఇలాంటి సినిమాల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రేక్షకులు దృష్టి మరలకుండా వారిని కథలో లీనం చేసేలా మలుపుల్ని రాసుకోవాలి. అలాంటి ట్విస్ట్లో ఈసినిమాలో కనిపించవు. ఈ సంక్లిష్టమైన కథను అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు తడబడినట్లుగా అనిపిస్తుంది. దాంతో ఏది గతమో, ఏది వర్తమానమో అర్థంకాదు. వారు ఎలా కలుసుకున్నారో కూడా అంతుపట్టదు.
హీరోగా తేజ సజ్జా అంగీకరించిన మొదటి సినిమా ఇది. కానీ కొవిడ్తో పాటు ఇతర కారణాల వల్ల మూడో సినిమాగా విడుదలైంది. సూర్యగా భిన్న లేయర్స్తో కూడిన పాత్రలో ఈజీగా నటించాడు. తండ్రి చావుకు తానే కారణమంటూ మదనపడే యువకుడిగా..మరోవైపు ప్రేమించిన వెన్నెలను కలవడానికి ప్రయత్నించే ప్రేమికుడిగా వైవిధ్యతను కనబరచిన తీరు బాగుంది. ఎమోషన్స్ సీన్స్లో చక్కగా నటించాడు. సీనియర్ హీరో రాజశేఖర్ తనయ శివానీ రాజశేఖర్ ఈ సినిమాతోనే కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమా అయినా ఎలాంటి బెరుకు లేకుండా స్క్రీన్పై హుషారుగా కనిపించింది. అల్లరి అమ్మాయిగా ఆమె నటన బాగుంది. సత్య కామెడీ సినిమాకు పెద్ద రిలీఫ్గా ఉపయోగపడింది. అతడి కనిపించిన సన్నివేశాలన్నీ నవ్వించాయి. దేవిప్రసాద్, శివాజీరాజా, తులసి కీలకమైన పాత్రల్లో ఆకట్టుకున్నారు.
దర్శకుడు ప్రశాంత్వర్మ ఈ చిత్రానికి కథను అందించారు. ఇందులోని ప్రధానాంశం ఇటీవల విడుదలైన ప్లేబ్యాక్కు దగ్గరగా ఉన్న భావన కలుగుతుంది. లక్ష్మీభూపాల డైలాగ్స్ బాగున్నాయి. కానీ స్క్రీన్ప్లే విషయంలో మరికొంత వర్క్ చేసుంటే బాగుండేది. రధన్ నేపథ్య సంగీతం బాగుంది.
కొత్త తరహా కథాంశాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది. థియేటర్కు వెళ్లాల్సిన పనిలేకుండా ఓటీటీలోనే విడుదలైంది. కాలక్షేపం కోసం ఓ సారి చూసేయచ్చు.