ముంబై: బాలీవుడ్ నటి రాఖీసావంత్ తల్లి జయభేడా ఇకలేరు. గత కొన్నాళ్లుగా ఎండోమెట్రియల్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. జయ భేడాకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ నాలుగో దశకు చేరడంతో మెదడు, ఊపిరితిత్తులు, కాలేయాన్ని దెబ్బతీసిందని, అదే ఆమె మరణానికి కారణమైందని వైద్యులు తెలిపారు.
కాగా, జయ భేడా అంత్యక్రియలను ఇవాళే నిర్వహించనున్నట్లు రాఖీసావంత్ వెల్లడించింది. ఈ మేరకు వాట్సాప్లో తనకు తెలిసిన అందరికీ శనివారం రాత్రే సందేశం పంపించింది. ‘నేను ఎంతగానో ప్రేమించే మా అమ్మ మరణం గురించి చెప్పాల్సి రావడం చాలా బాధగా ఉంది. ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. రేపు (ఆదివారం) అంధేరి వెస్ట్లోని ఒసివారాలోగల మున్సిపల్ క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ఆ అంత్యక్రియల సందర్భంగా మాతో కలవండి’ అన్నది ఆ సందేశం సారాంశం.
కాగా, జయభేడా ప్రాణాలు కోల్పోకముందు కొన ఊపిరితో ఉండగా రాఖీ సావంత్ ఆమె బెడ్ దగ్గర కింద కూర్చుని ఏడుస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. ఆ వీడియోకు జతచేసిన ఉద్వేగభరితమైన టెక్ట్స్లో ‘ఇవాళ నా తల నుంచి నా తల్లి చేయి దూరమైంది. ఇంక నేను కోల్పోవడానికి ఏమీ లేదు. ఐ లవ్ యూ అమ్మా. నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి..? నన్ను ఎవరు ప్రేమగా కౌగిలించుకుంటారు..? నేనేం చేయాలి..? నేను ఎక్కడికి పోవాలి..? ఐ మిస్ యూ అమ్మా..!’ అని పేర్కొంది.