Cyber Scam Alert | ‘లక్కీ భాస్కర్’ సినిమా ఘనవిజయంతో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక మీనాక్షి చౌదరి తాజాగా ఒక పెద్ద సైబర్ మోసంపై స్పందించారు. తన పేరుతో కొందరు కేటుగాళ్లు ప్రజలను, అభిమానులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె గుర్తించారు. తనలా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఒక గుర్తుతెలియని వ్యక్తి వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెడుతూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు నకిలీ వ్యక్తి వాడుతున్న ఫోన్ నంబర్ను స్క్రీన్ షాట్ తీసి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీనాక్షి పోస్ట్ చేశారు. ఈ నంబర్ నుండి ఎవరికైనా మెసేజ్లు లేదా ఫోన్ కాల్స్ వస్తే నమ్మవద్దని, వెంటనే ఆ నంబర్ను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని కోరారు. అది తన నంబర్ కాదని స్పష్టం చేసిన ఆమె, ఈ మోసాన్ని సకాలంలో గుర్తించి తన దృష్టికి తీసుకువచ్చిన నెటిజన్లకు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్లో వరుస క్రేజీ ప్రాజెక్ట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.