సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గాలోడు’. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తెలిపింది నాయిక గెహ్నా సిప్పీ. ఆమె మాట్లాడుతూ…‘కాలేజ్లో చదువుకునే అమ్మాయికి, పనీ పాటా లేకుండా తిరిగే అబ్బాయికి మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ప్రేమలో పడ్డాక వారి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ఇందులో నేను అమ్మా నాన్నల గారాల కూతురిగా కనిపిస్తా. కరోనా సమయంలో ఈ సినిమా షూటింగ్ చేశాం. లఢక్లో చేసిన చిత్రీకరణ కష్టంగా అనిపించింది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించా కానీ యాస కుదరలేదు. తెలుగులో నేను చేసిన రెండో చిత్రమిది. మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తున్నాను. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని ఉంది. నాగ చైతన్య, రామ్ చరణ్ అంటే ఇష్టం’ అని చెప్పింది.