Actor Suresh Gopi | మలయాళ నటుడు సురేశ్ గోపీ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మీడియాతో జరిగిన ఇంటరాక్షన్లో తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ నటుడు, బీజేపీ నేత అయిన సురేశ్ గోపీపై మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బుధవారం నడకావు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. ఆయన ఉదయం 11.45 గంటలకు పోలీస్ స్టేషన్కు సురేశ్ గోపీ చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు.
మధ్యాహ్నం 2.25 గంటలకు ఆయన పోలీస్స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. సురేశ్ గోపీకి మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వారిని చెదరగొట్టారు. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలకు సురేశ్ గోపీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, నటుడిని అరెస్టు చేయలేదని.. అయితే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసినట్లు నడకావు పోలీస్స్టేషన్ ఆఫీసర్ తెలిపారు. రాజకీయ నేతగా మారిన నటుడి వాంగ్మూలం నమోదు చేశామని.. ఇప్పటికైతే మళ్లీ హాజరుకావాలని కోరలేదని పేర్కొన్నారు.
గత నెల చివరలో సురేశ్ గోపీ నార్త్ కోజిక్కోడ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమయంలోనే ఓ మహిళా విలేకరికి సమాధానం ఇస్తూనే ఆమె భుజంపై చేయి వేశారు. సురేశ్ గోపీ ప్రవర్తనతో షాక్కు గురైంది. ఆయనకు కాస్త దూరం జరిగింది. ఆ తర్వాత మరో ప్రశ్న అడిగేందుకు ముందుకు రాగా.. మరోసారి ఆమెను తాకారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహిళా జర్నలిస్ట్తో వ్యవహరించిన తీరుపై సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా సురేశ్ గోపీ క్షమాపణలు చెప్పారు. తాను ఆమెను కుమార్తెగా భావించానని.. ఆప్యాయంగానే భుజంపై చేసి వేశానన్నారు. జర్నలిస్ట్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానన్నారు. సురేశ్ గోపీ ప్రవర్తనతో తాను మానసికంగా కలత చెందానని సదరు జర్నలిస్ట్ పేర్కొన్నారు. ఆ తర్వాత కోజిక్కోడ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నటుడిపై సెక్షన్ 354ఏ కింద అభియోగాలను మోపి.. కేసును నడకావు పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు.