Actor Sarath babu | శరత్బాబు శ్రీకాకుళం జిల్లాలోని అముదాలవలసలో 1951 జూలై 31న జన్మించారు. శరత్బాబు తండ్రి హోటల్ బిజినెస్ చేసేవాడు. ఆయన తండ్రి శరత్బాబును హోటల్ వ్యాపారంలోకి తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా.. శరత్బాబు మాత్రం ఐపీఎస్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే కంటిచూపు సమస్యతో అది సాధ్యపడలేదు. ఇక అప్పుడు కొందరు శరత్బాబు తల్లితో మీ అబ్బాయి అందంగా ఉంటాడు. హీరోను చేయమని చెప్పారట. దాంతో శరత్బాబును ఆయన తల్లి ప్రోత్సహించి ఇండస్ట్రీలోకి పంపించారు.
మద్రాస్ ట్రైన్ ఎక్కిన శరత్బాబు కే. బాబు రావు దర్శకత్వంలో తెరకెక్కిన రామరాజ్యం సినిమాతో తొలిసారి కెమెరా ముందు నటించాడు. తొలి సినిమాతోనే జగ్గయ్య, సావిత్రి, ఎస్.వి.రంగారావు వంటి దిగ్గజాలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్ల వరకు శరత్బాబు మరో సినిమా చేయలేదు. అలా 1976లో రాజా అనే సినిమాలో అడ్వకేట్ పాత్రలో నటించాడు. ఈ సినిమా శరత్బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాతి ఏడాది పట్టిన ప్రవేశం అనే సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో శరత్బాబుకు అక్కడ కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత ఏడాదికి పది, పన్నెండు సినిమాలతో బిజీ నటుడుగా మారిపొయాడు.
తెలుగు,తమిళంతో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించాడు. ఇప్పటి వరకు శరత్బాబు 200కు పైగా సినిమాల్లో నటించాడు. మరో చరిత్ర, గుప్పుడు మనసు, తయారమ్మా బంగారయ్య, మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, సాగర సంగమం, సితారా, కాంచనగంగా, అగ్ని గుండం, స్వాతి ముత్యం, కాశ్మోరా, సంసారం ఒక చదరంగం, అభినందన, ప్రాణ స్నేహితులు, స్వాతి చినుకులు, కోకిల వంటి పలు సినిమాలు శరత్బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. చివరగా శరత్బాబు తెలుగులో వకీల్సాబ్ సినిమాలో కనిపించాడు. ఇక ప్రస్తుతం శరత్బాబు నటించినర మళ్లీ పెళ్లి విడుదలకు సిద్ధంగా ఉంది.