‘నటుడిగా యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉంది. సెట్స్లో దర్శకుడి నుంచి లైట్బాయ్ వరకు ప్రతి ఒక్కరిని గౌరవించాలని మా అమ్మ విజయనిర్మల చెప్పింది. ఆ సలహాను నేటికి పాటిస్తున్నా. ఆ క్రమశిక్షణే నన్ను ముందుకు నడిపిస్తున్నది’ అని అన్నారు సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ. నేడు ఆయన జన్మదినం.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఆయన పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నటుడిగా యాభై ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కొత్త పాత్రలు వేసే అవకాశం లభిస్తుండటం ఆనందంగా ఉంది. యువ దర్శకులు, రచయితలు నన్ను దృష్టిలో పెట్టుకొని విభిన్నమైన క్యారెక్టర్స్ సృష్టిస్తుండటం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నా. సుదీర్ఘ ప్రయాణంలో ఏ రోజూ నేను నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు. వివాదాల జోలికి వెళ్లలేదు. పారితోషికం గురించి ఆలోచించకుండా మంచి సినిమాలకు అండగా నిలుస్తున్నా. స్వీయనిర్మాణ సంస్థ విజయకృష్ణ బ్యానర్లో గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలొచ్చాయి. ఆ బ్యానర్ను తిరిగి ప్రారంభించే ఆలోచన ఉంది. ఈ సంస్థ ద్వారా న్యూజనరేషన్తో కూడిన వినోదప్రధాన సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. అమ్మ విజయనిర్మల పేరుతో ఓ స్టూడియోను నిర్మిస్తున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నటీనటుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసింది. ‘మా’ను రాజకీయవేదికగా మార్చవద్దు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటున్నా. సినీపెద్దలు, ఏపీ ప్రభుత్వం కలిసి త్వరలో చక్కటి నిర్ణయానికి వస్తారనే నమ్మకముంది. ప్రస్తుతం అంటే సుందరానికి, అన్నీ మంచి శకునములే, గని,తో పాటు పలు సినిమాలు, వెబ్సిరీస్లలో నటిస్తున్నా’ అని తెలిపారు.