నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పకులు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్లో చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ..‘ఈ చిత్రంతో మాది రెండున్నరేళ్ల ప్రయాణం. కోవిడ్ టైమ్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా నాణ్యతలో రాజీ పడకుండా చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడు మంచి కథ చెప్పారు. దాన్ని ఆకట్టుకునేలా తెరక్కెకించారు. నాకో మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా కోసం తొలిసారి పాదయాత్ర చేశాను. అన్ని ఊర్లు తిరిగాను. సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్లి సినిమా గురించి చెప్పాను’ అని అన్నారు. ‘సినిమాల కోసం కష్టపడే హీరో నాగశౌర్య. విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నాడు. సినిమా విజయం సాధించాలి’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ మాట్లాడుతూ..‘నిర్మాత సపోర్ట్గా నిలబడటం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నాగశౌర్య మొదటి నుంచీ ఈ సినిమాను నమ్మారు’అన్నారు. సకుటుంబంగా ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారని, ఇది నాగశౌర్య కెరీర్లో హిట్గా నిలుస్తుందని నిర్మాత ఉషా మూల్పూరి చెప్పారు.