Telugu Cinema | అక్కడో ఎస్టేట్.. ఇక్కడో ఎస్టేట్… అక్కడో జగమొండి.. ఇక్కడో జగమొండి.. అక్కడున్న మొండిఘటం కోసం హీరో త్యాగం చేస్తాడు. స్నేహితుడి కోసం, ప్రేయసి బాగు కోసం ఇక్కడున్న మొండిఘటం త్యాగానికి పూనుకుంటాడు. దడ పుట్టించే మెదడున్న ఇద్దరు మనుషులు దౌడు తీయించిన కథలే ‘ఆత్మబలం’, ‘గుడిగంటలు’! ఐదు రోజుల నిడివితో 1964 జనవరిలో విడుదలైన ఈ రెండు సినిమాలు.. చిత్రరాజాల జాబితాలో పదిలంగా చోటు సంపాదించుకున్నాయి. ఈ జంట సినిమాల షష్టిపూర్తిసందర్భంగా… ఒక్కసారి బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్లిపోదాం…!
‘ఆత్మబలం’ సినిమాకు బెంగాలీ చిత్రం అగ్నిసంస్కార మాతృక. కుమార్ (జగ్గయ్య) చిన్నప్పుడే తండ్రి ఆత్మహత్యను చూసి మాన సికంగా దెబ్బతింటాడు. తనకు కావాల్సింది దక్కకపోతే చంపనైనా చంపుతాడు, చావనైనా చస్తాడు. పెద్దయ్యేకొద్దీ మరింత కఠినంగా మారుతాడు. కుమార్ ఆస్తిపరుడు. వాళ్ల ఫ్యాక్టరీలో ఆనంద్ (ఏయన్నార్) ఇంజినీర్గా పనిచేస్తుంటాడు. కుమార్ తల్లి (కన్నాంబ) చేరదీసిన జయ (సరోజాదేవి), ఆనంద్ ప్రేమించుకుంటారు. అయితే, మానసిక చికిత్సాలయం నుంచి తప్పించుకున్న కుమార్ను పట్టుకొని, బుజ్జగించి ఇంటికి తీసుకొస్తాడు ఆనంద్. అక్కడ జయను చూసిన కుమార్.. ఆమెను పెండ్లి చేసుకుంటానని తల్లికి చెబుతాడు.
ఆమె కాదంటే ఎక్కడ ప్రాణాలు తీసుకుంటాడో అని కుమార్ తల్లి భయపడుతుంది. తన కొడుకును పెండ్లి చేసుకోవాల్సిందిగా జయను కోరుతుంది. తమను ఆదరించిన యజమానురాలి సంతోషం కోసం ఆనంద్, జయ తమ ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడతారు. అయితే, జయ తనను కాకుండా ఆనంద్ను ప్రేమిస్తున్నదని తెలుసుకుంటాడు కుమార్. తనకు దక్కని జయ అతనికీ దక్కొద్దనుకుంటాడు. తనను ఆనందే చంపినట్లుగా ఆధారాలు సృష్టించి ఆత్మహత్యకు పూనుకుంటాడు. కుమార్కు చిన్నప్పటి నుంచి చికిత్స చేసిన డాక్టర్ సాయంతో దాన్ని ఆత్మహత్యగా నిరూపించి, ఆనంద్ను ఉరికంబం నుంచి రక్షిస్తుంది జయ. ఇదీ కథ!
లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అక్కినేని ఈ సినిమాలో హీరో అయినా.. కథంతా జగ్గయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. భయం, కోపం, అమాయకత్వం కలగలసిన పాత్రను జగ్గయ్య అద్భుతంగా పండించాడు. నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. సినిమా కథ విన్నాక ఇందులో పాటలకు అవకాశమే లేదన్నాడట సంగీత దర్శకుడు కేవీ మహదేవన్. అక్కినేని, సరోజాదేవి మధ్య లవ్ట్రాక్ పక్కాగా కుదిరాక అందమైన ట్యూన్స్ ఇచ్చాడు మహాదేవన్. పాటలతోపాటు మాటల్లోనూ ఆచార్య ఆత్రేయ చేయి వేయడంతో ప్రతి పాటతోపాటు సీనూ పండింది. ‘హృదయానికి సంబంధించిన సమస్యలు వేదనకే కాని, వాదనకు అందవు’ లాంటి డైలాగులు ఆత్రేయ శైలికి అద్దం పడతాయి. తరతరాలుగా అందరినీ ఉర్రూతలూగిస్తున్న ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే..’ పాట ఈ చిత్రంలోనిదే!
‘గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి.. నీ కండ్లల్లో ఉన్నదీ భలే బడాయి..’, ‘పరుగులు తీసే నీ వయసునకు.. పగ్గం వేసెను నా మనసు..’ పాటలు ఆ తరం ప్రేమికుల గీతాలై మార్మోగాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ.. నా చూపుల్లో చిక్కుకున్న వన్నెకాడ..’ మరో ఎవర్గ్రీన్ పాటగా ప్లేలిస్ట్లో చోటు సంపాదించుకుంది. ఇలా సినిమాలోని అన్ని పాటలూ ప్రేక్షకులు కోరుకునే గీతాలై ఇప్పటికీ రేడియోలో రోజూ వినిపిస్తూనే ఉంటాయి.
తమిళంలో వచ్చిన ‘ఆలయమణి’ చిత్రం ‘గుడిగంటలు’ సినిమాకు మాతృక. కథలోకి వెళ్తే… వాసు (ఎన్టీఆర్) జమీందారు. అతని ప్రాణ స్నేహితుడు హరి (జగ్గయ్య). చిన్నప్పటి నుంచి వాసుది తీవ్రమైన మనస్తత్వం. తన వస్తువును ఎవరైనా తీసుకుంటే ఒప్పుకోడు. వాసు మనసెరిగి ప్రవర్తిస్తుంటాడు హరి. ఎస్టేట్ మేనేజర్ సుబ్బయ్య (నాగయ్య) కూతురు కస్తూరి (కృష్ణకుమారి), హరి ప్రేమించుకుంటారు. అతనితో సరదాగా తన పేరు మాయ అని చెబుతుంది కస్తూరి. అనుకోకుండా కస్తూరిని చూసిన వాసు ఆమెను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు. కస్తూరి అక్క ఊహించని సమస్యలో ఇరుక్కుంటుంది. కుటుంబ గౌరవం కోసం వాసును పెండ్లి చేసుకునేందుకు కస్తూరి ఒప్పుకోక తప్పదు. తన స్నేహితుడు పెండ్లాడుతున్న కస్తూరే మాయ అని హరికి తర్వాత తెలుస్తుంది.
స్నేహితుడి కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు. నిశ్చితార్థం తర్వాత ఓ ప్రమాదంలో వాసు కాళ్లు చచ్చుబడిపోతాయి. వాసును కంటికి రెప్పలా చూసుకుంటుంది కస్తూరి. ఎస్టేట్లో కొందరు హరి, కస్తూరి చనువుగా ఉంటున్నారని వాసులో అనుమాన బీజం నాటుతారు. హరిని చంపాలను కుంటాడు వాసు. కొండ పైనుంచి కిందికి తోసేస్తాడు. ప్రమాదం నుంచి తప్పించుకున్న హరి తను ప్రేమించిన మాయే.. కస్తూరి అని, మా ప్రేమ త్యాగం చేశామని చెబుతాడు. ప్రేమికులను విడదీశానని పశ్చాత్తాపంతో వాసు కొండ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నిస్తాడు. వాసు చనిపోయాడనే భావిస్తారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడిన వాసు.. కొన్నాళ్లకు జమీందారు ఇంట్లో పెండ్లి జరుగుతుందన్న వార్త విని, హరి, కస్తూరి వివాహం చేసుకుంటున్నారని భావిస్తాడు. ఆ పెండ్లి చూడటానికి ఆనందంగా వెళ్తాడు. అక్కడ హరి మరో అమ్మాయిని పెండ్లాడటం చూసి ఆశ్చర్యపోతాడు. పెండ్లి కాకుండానే వైధవ్యాన్ని అనుభవిస్తున్న కస్తూరి నిర్మలమైన మనసుకు వాసు చలించిపోతాడు. ఆమెను పెండ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
ప్రతి మనిషిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. ఈ రెండిటి మధ్య జరిగే రణమే ‘గుడిగంటలు’ సినిమా. విపరీత మనస్తత్వం ఉన్న వ్యక్తి పాత్రలో ఎన్టీఆర్ జీవించాడు. కథ, కథనాలు అందంగా అమరడంతో ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఏడాది మూడో ఉత్తమ చిత్రంగా కాంస్య నందిని అందుకుంది. మధుసూదనరావు డైరెక్షన్, ఘంటసాల సంగీతం ఈ చిత్రానికి బలాలు! సి.నారాయణరెడ్డి రాసిన ‘నీలికన్నుల నీడలలోనా.. దోరవయసుల జావళిలోనా..’, ఆరుద్ర విరచిత ‘దూరాన నీలి మేఘాలు…’, ఆత్రేయ రచించిన ‘ఎవరికి వారౌ స్వార్థంలో..’, దాశరథి రాసిన ‘నీలోన నన్నే నిలిపేవు నువ్వే..’ పాటలు ఆపాత మధురాల జాబితాలో స్థిరంగా నిలిచిపోయాయి. అనిశెట్టి రచించిన ‘జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరంలో పండిపోయితిరా..’ పాట చిత్రానికే హైలైట్గా నిలిచింది. ‘స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా.. బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా.. దైవశక్తి మృగత్వమును సంహరించెరా.. సమరభూమి నా హృదయం శాంతిపొందెరా’ అని సాగే చరణం… కథానాయకుడి మారిన మనసుకు అద్దం పడుతుంది.
సంక్రాంతికి పెద్దసినిమాలు రావడం తెలుగు చిత్రసీమ రివాజు. అలా 1964లో జనవరి 9న విడుదలైంది ‘ఆత్మబలం’. జగపతి పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని హీరో. జగ్గయ్యది కీలకపాత్ర. దీని చుట్టూనే కథంతా తిరుగుతుంది. బి.సరోజాదేవి, కన్నాంబ, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం తదితరులు ఇతర తారాగణం.
అదే ఏడాది జనవరి 14న విడుదలైంది ‘గుడిగంటలు’. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరో. జగ్గయ్య, కృష్ణకుమారి, నాగయ్య, రేలంగి, గిరిజ, రమణారెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు.
‘ఆత్మబలం’ చిత్రంలో మాటలు ఆత్రేయ పండిస్తే… ‘గుడిగంటలు’లో ముళ్లపూడి పూయించారు. కథావస్తువు దాదాపు ఒకటే అయినా… కథనాలు వేరు. సినిమాలు వేరైనా దర్శకుడు మాత్రం ఒకరే కావడం విశేషం. విక్టరీని ఇంటిపేరుగా మలుచుకున్న వి.మధుసూధనరావు ఈ రెండు సినిమాలకు డైరెక్టర్.
‘చిటపట చినుకులు పడుతూ ఉంటే.. చెలికాడే సరసన ఉంటే..’ చలికాలంలో వర్షరుతువును మోసుకొచ్చిన పాట. ‘ఆత్మబలం’లోని ఈ గీతానికి వంతగా ‘గుడిగంటలు’లో పీబీ శ్రీనివాస్ ఎత్తుకున్న ‘నీలికన్నుల నీడలలోనా..’ పాట పొగమంచు హత్తుకున్న చలిగాలికి మరింత మత్తెక్కించింది. ఈ తన్మయత్వంలో ఉండగానే.. ‘ఎక్కడికీ పోతావు చిన్నవాడ..’ ఓ థియేటర్లోంచి సుశీలమ్మ నిలదీత! ‘జన్మమెత్తితిరా….’ అని మరో థియేటర్ నుంచి ఘంటసాల బదులు! ఇలా పోటాపోటీగా సాగిన పాటలు.. ఈ రెండు చిత్రాల మ్యూజిక్ ఆల్బమ్స్ను పదిలంగా దాచుకునేలా చేశాయి.
చివరగా.. గాయ పడిన మనసులు అందరి మనుషుల్లా మసులుకోవడం కష్టమే! అండగా నిలిచిన మనసును అర్థం చేసుకుంటే కానీ, వారికి ఊరట లభించదు. ‘ఆత్మబలం’లో.. ఆ మనసును బలవంతంగా గెలుచుకోవాలని ప్రయత్నించి కుమార్ ఓడిపోతాడు. ‘గుడి గంటలు’ చిత్రంలో ఆ మనిషిని అర్థం చేసుకొని, తన మనసును మార్చుకున్న వాసు గెలిచాడు. వలచిన మనసును గెలవడం అంటే.. ఆ మనిషిని అర్థం చేసుకోవడమే! అప్పుడు ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనిస్తాయి.