సీనియర్ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆలంబన’. పార్వతి నాయర్ కథానాయిక. పారి కె.విజయ్ దర్శకుడు. కోటపాడి జె.రాజేశ్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటైర్టెన్మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ నెల 15న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేశారు. ‘ఇది థియేటర్ సినిమా. థియేటర్లో చూస్తేనే ఆ విజువల్ బ్యూటీ తెలుస్తుంది.
యువతరానికి కావాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉంటాయి.’ అని వైభవ్ చెప్పారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని, కథే ఈచిత్రానికి ప్రధాన బలమని, యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమా చేశానని దర్శకుడు చెప్పారు. ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టమని, ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని పార్వతీ నాయర్ అన్నారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మహేశ్వర్రెడ్డి తెలిపారు.