అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సూపర్స్టార్ కృష్ణకు తుది వీడ్కోలు పలికారు. మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. ఏపీ సీఎం జగన్, హీరో బాలకృష్ణ, నటి జయప్రద, నటుడు కోట శ్రీనివాసరావు, అలీ తదితరులు ఈ దిగ్గజ నటుడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మహాప్రస్థానంలో కృష్ణ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం చేసి..గాలిలోకి కాల్పులు జరిపారు. కృష్ణకు కుమారుడు మహేష్ బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అభిమానుల సందర్శనార్థం ఉదయం నానక్రామ్గూడలోని నివాసం నుంచి ఫిలింనగర్ పద్మాలయా స్టూడియోస్కు కృష్ణ భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. తమ అభిమాన కథానాయకుడిని చివరిసారి చూసేందుకు పద్మాలయా స్టూడియోస్కు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.