Hari Hara Veera Mallu Movie | పవన్ కళ్యాణ్ లైనప్లో హరిహర వీరమల్లు అనే ఓ ప్రాజెక్ట్ ఉందని ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోతున్న టైమ్లో పవన్ బర్త్డేకు ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసి సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండేళ్ల క్రితమే పట్టాలెక్కింది. కానీ ప్యాసింజర్ ట్రైన్లా నెమ్మదిగా ప్రయాణం సాగిస్తుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్లు వచ్చినప్పుడు ప్యాసింజర్ ట్రైన్కు ఏ విధంగా బ్రేకులు పడతాయో హరిహర వీరమల్లు పరిస్థితి కూడా దాదాపుగా అంతే. ఐదారు నెలల కింద ప్రకటించిన సినిమాలు సైతం షూటింగ్ చివరి దశలోకి వచ్చేస్తున్నాయి. కానీ హరి హర వీరమల్లు మాత్రం ఓ కొలిక్కి రాలేకపోతుంది. ఈ సినిమా పెండింగ్ వర్క్ ఇంకా చాలానే ఉందని ఇన్సైడ్.
పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను పక్కన పెట్టాడు. పైగా ఐదారు నెలల్లో కంప్లీట్ అవుతుందంటే డేట్స్ అడ్జెస్ట్ చేయోచ్చు. కానీ ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది. అందుకే పవన్ ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోతున్నాడట. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత ఏ.ఏం రత్నం. హరిహర వీరమల్లు సినిమా పీరియాడిక్ కాన్సెప్ట్తో గ్రాండ్ స్కేల్పైన తెరకెక్కుతుందని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన సినిమాను పూర్తి చేయడం కష్టం. ఎందుకంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు. పెద్ద పెద్ద సెట్స్ వేయాలి. గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఎండింగ్లోపు సినిమానూ పూర్తి చేసి ఆపై వీఎఫ్ఎక్స్ పనులపై కూర్చోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు.
ఎట్టి పరిస్థుతుల్లో ఎలక్షన్ల ముందే సినిమాను విడుదల చేస్తామని పవన్ అభిమానులకు హామీ కూడా ఇచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. ఎందుకుంటే వచ్చే ఏడాది పవన్వి ఇప్పటికే రెండు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇక ఇప్పుడు మూడోది కూడా చేరడంతో పట్టరాని సంతోషంతో ఉన్నారు. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొఘల్ కాలం నాటి ఓ వజ్రాల దొంగగా పవన్ ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీష్ ఫక్రీ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ. దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.