‘ఈ సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి ప్రేమతత్వం బోధపడుతుంది. థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులు ప్రేమను గుండెల్లో నింపుకొని తిరిగొస్తారు. ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే రివర్స్ స్క్రీన్ప్లేతో నడిచే చిత్రమిది’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ఆయన దర్శకత్వంలో అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పొయెటిక్ లవ్స్టోరీ ‘8వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాయిక పాత్రకోసం క్లాసికల్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ రెండూ తెలిసిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది. తనే అనంతిక. ఈ చిత్రంలో ఆమె అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది’ అన్నారు. ఈ సినిమాలో తాను శుద్ధి అయోధ్య అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, కథలోని భావోద్వేగాలు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతాయని కథానాయిక అనంతిక పేర్కొంది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు కలబోసిన చిత్రమిదని నిర్మాత నవీన్ యెర్నేని తెలిపారు.