హీరోగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన ఇంద్రసేన.. ‘శాసనసభ’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంద్రసేనకు సంబంధించిన లుక్ను దసరా పర్వదినాన విడుదల చేశారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవిబస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాజ్ హీరోయిన్. సీనియర్ నటుడు డా. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాత షణ్ముగం సాప్పని మాట్లాడుతూ ‘పొలిటికల్ థ్రిల్లర్ ఇది.
యూనివర్సల్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో కథానాయకుడు ఇంద్రసేన పాత్ర విభిన్నంగా, డైనమిక్గా వుంటుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం. మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్రెడ్డి, కెమెరా: కృష్ణమురళి.