ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఇటీవల బాలీవుడ్ సినిమా విఫలమవుతుంటే..దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. గతేడాది హిందీ చిత్రాలు వరుసగా బోల్తా కొట్టాయి. ఇటీవల షారుఖ్ ‘పఠాన్’తో మళ్లీ హిందీ చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ట్రెండ్పై స్పందించారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఆయన మాట్లాడుతూ…‘మంచి సినిమాలు రూపొందిస్తే తప్పకుండా ఆదరణ పొందుతాయి. మనం ఆకట్టుకునే విధంగా సినిమాలు తెరకెక్కించకుంటే ప్రేక్షకులు ఎలా చూస్తారు?. మన దేశం అంటే ముంబై అనే అనుకుంటున్నారు ఇక్కడి దర్శక నిర్మాతలు. ఇక్కడి నేపథ్యాలనే ఎంచుకుంటున్నారు. కానీ సంస్కృతిపరంగా దేశం విశాలమైనది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు రూపొందించాలి. ప్రతి ఒక్కరూ తామో క్లాసిక్ సినిమా రూపొందిస్తున్నామనే అనుకుంటారు. కానీ ఎలాంటి చిత్రాన్ని చేస్తున్నామని తమని తాము ప్రశ్నించుకోరు’ అని అన్నారు. సల్మాన్ నటించిన కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటించింది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించారు.