హీరో, విలన్ కొట్టుకొని కమెడీయన్ని చంపేసినట్టు తయారైంది పాపం త్రిష పరిస్థితి. ఇద్దరు రాజకీయనాయకుల మధ్య తలెత్తిన వివాదం అనవసరంగా త్రిష మెడకు చుట్టుకుంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడు ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు ఏవీ రాజుకీ, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే జి.వెంకటాచలానికీ మధ్య ఎందుకు వివాదం మొదలైందో తెలీదుగానీ, మీడియాతో వెంకటాచలాన్ని ఉద్దేశించి ఏవీ రాజు మాట్లాడుతూ, ఆయన్ను విమర్శిస్తూ.. మధ్యలో హీరోయిన్ త్రిష టాపిక్ తెచ్చాడు. ఆమె వ్యక్తిగత జీవితం పైన కూడా కామెట్లు చేశారు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో త్రిషకు చిర్రెత్తుకొచ్చింది. ‘అటెన్షన్కోసం తాపత్రయపడే దిగజారుడు మనస్తత్వంగల వాళ్లను చూస్తే నాకు అసహ్యం. నా ఓపిక కూడా నశించింది. ఇక క్షమించను.. ఇకపై వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా లీగల్ డిపార్ట్మెంట్ నుంచే సమాధానం వస్తుంది.’ అంటూ తన వ్యక్తిగత సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్ట్ చేసింది త్రిష.