Auto Debit | ఆటో డెబిట్ పేమెంట్స్ నియంత్రణ కోసం బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి అదనపు ధ్రువీకరణ పొందాలని ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు ఇబ్బందికర పరిస్థితులకు కారణం అవుతాయా.. మీ బ్యాంకు ఖాతాల నుంచి ఇంటి రుణం.. వాహన రుణం.. ఇతర రికరింగ్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే ఖాతాదారులు తమ ఈఎంఐ చెల్లింపులు, బీమా ప్రీమియం, వాటర్, విద్యుత్ తదితర బిల్లుల చెల్లింపుల కోసం బారులు తీరాల్సి రావచ్చు. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు చెల్లింపులు.. ఆన్లైన్ పేమెంట్స్ సంస్థల ద్వారా జరిగే చెల్లింపులకు భద్రత కల్పిస్తూ ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఆర్బీఐ జారీ చేసిన న్యూ రూల్ ప్రకారం 24 గంటల ముందు బ్యాంకులకు ఖాతాదారులు ప్రీ-డెబిట్ మెసేజ్ పంపితేనే ఆటో డెబిట్ పేమెంట్స్ జరుగుతాయి. ఇక రూ.5000 దాటిన ఆటోమేటెడ్ పేమెంట్స్కు సంబంధిత ఖాతాదారు స్వయంగా వన్టైం పాస్వర్డ్ (ఓటీపీ) ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది.
రికరింగ్ పేమెంట్స్ .. ఆటో డెబిట్స్ మీద ఆర్బీఐ నిబంధనను గడువులోగా అంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయడం కోసం ప్రైవేట్ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలూ కృషి చేస్తున్నాయి.
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి (రికరింగ్ పేమెంట్స్ కోసం ఈ-మాండేట్ ప్రాసెసింగ్) సంబంధిత ఖాతాదారులు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తి చేస్తేనే ఆటో డెబిట్స్ అనుమతిస్తామని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. మర్చంట్ వెబ్సైట్, యాప్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల నిర్వాహకులకు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కామన్ ఈ-మాండేట్ ప్లాట్ఫామ్ అమలు చేయడానికి పేమెంట్ అగ్రిగేటర్స్ రాజోర్పే, బిల్ డెస్క్ వంటి సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో పడినట్లు వార్తలొచ్చాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లు మాత్రం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆర్బీఐ ఆదేశాలు అమల్లోకి తీసుకొస్తామని తెలిపాయి.